తదియ - గాయత్రి దేవి - పులిహోర (23-09-17) - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Saturday, 9 September 2017

తదియ - గాయత్రి దేవి - పులిహోర (23-09-17)

తదియ - గాయత్రి దేవి -  పులిహోర (23-09-17)




వస్త్రం:కాషాయ రంగు

శ్లో: ఓం భూర్భువస్సువః  తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||
అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది.

"ముక్తా విద్రుమ హేమనీల
ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:
యుక్తామిందు నిబద్ధరత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!
గాయత్రీం వరదాభయాంకుశమ్
కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద
యుగళం హసైర్వాహంతీం భజే"
సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. "ఓం భూర్భావస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోన: ప్రచోదయాత్"అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. అమ్మవారికి అల్లపు గారెలు నివేదన చేయాలి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.

ప్రసాదం: పులిహోర

పులిహోర
కావలసినవి
బియ్యం: అరకిలో, చింతపండు: 100 గ్రా, ఎండుమిర్చి: 25, సెనగపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: 2 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: టీస్పూను, ఇంగువ: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: టీస్పూను, నువ్వులనూనె: 200 గ్రా, దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: అరటీస్పూను, మెంతులు: అర టీస్పూను, వేరుసెనగపప్పు లేదా జీడిపప్పు(రెండూ కలిపి కూడా వేసుకోవచ్చు): 50 గ్రా, కరివేపాకు: 10 రెబ్బలు
తయారుచేసే విధానం
* అన్నం ఉడికించి టేబుల్‌స్పూను నువ్వులనూనె వేసి చల్లార్చాలి.
* చింతపండులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టి చిక్కని గుజ్జు తీయాలి. ఓ చిన్న బాణలిలో మెంతులు వేసి వేయించి పొడి చేయాలి.
* మరో బాణలిలో నువ్వుల నూనె వేసి కాగాక, పప్పులు, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు అన్నీ వేసి వేయించాలి. తరవాత చింతపండు గుజ్జు వేసి సిమ్‌లో ఉడికించాలి. తరవాత కరివేపాకు రెబ్బలు, ఇంగువ, ఉప్పు కూడా వేసి ఉడికించాలి. చింతపండు గుజ్జు దగ్గరగా ఉడికిన తరవాత స్టవ్‌మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు అందులో మెంతిపొడి వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని ఉడికించి చల్లార్చిన అన్నంలో వేసి కలపాలి. అన్నం చల్లార్చేటప్పుడు మరో టేబుల్‌స్పూను నువ్వుల నూనె వేసి కలిపితే మరింత రుచిగా ఉంటుంది.