నవవిధ భక్తి మార్గాలు - SRI BALAYOGISWARA ASRAMAM

Breaking

Thursday, 7 September 2017

నవవిధ భక్తి మార్గాలు

నవవిధ భక్తి మార్గాలు
భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.



1
శ్రవణం: భగవంతుని గూర్చిన గాధలు, భజనలు, కీర్తనలు వినుట

2
కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట

3
స్మరణం: భగవంతుని స్మరించుట

4
పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట

5
అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని,హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.


6
వందనం: ప్రణామం చేయుట

7
దాస్యం: భగవంతునకు దాసుడగుట

8
సఖ్యం: భగవంతుని స్నేహితునిగా భావించి ఆరాధించడం

9
ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట


శ్రవణము

1.శ్రవణము : ఇక్కడ ఈ శ్రవణం అనే పదమే వాడాల్సిన అవసరం ఏమిటి?పఠనం వాడొచ్చుగా? దీన్ని వినటం అనే అర్ధంలో కాకుండా చెప్పిన మాట వినటం అనే అర్ధంలో ఉపయోగించినప్పుడు మనకి సరైన ఫలితాలు వస్తాయి.. సత్ప్రవర్తన అభివృద్ధి చేసుకోవాటంలో ఇది...అద్భుతమైన ఫలితాలిస్తుంది...
ఉదా : సాయి సచ్చరిత్రలో వి.హెచ్‌ ఠాకూరుకి బాబాగారు చెప్పిన ఉపదేశం వినండి ఇచ్చటి మార్గం అప్పా (కన్నడయోగి) నీతులు బోధించినంత సులువుకాదు.. నాన్హేఘాటుని దున్నపోతునెక్కి దాటడం కంటే కష్టం...ఆధ్యాత్మ మార్గం అత్యంత కష్ఠసాధ్యం....అప్పా చెప్పినదంతయు నిజమే.కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టాలి, ఊరకనే గ్రంథములు చదవటం వల్ల ప్రయోజనం లేదు.నీవు చదివిన విషయాలను జాగ్రత్తగా విచారించి, అర్ధం చేసుకుని, అభ్యసించి ఆచరణలో పెట్టాలి. గురువు అనుగ్రహంలేని ఉత్త పుస్తకఙ్ఞానం నిష్ప్రయోజనం.గురువు గారి మనసుని అర్ధం చేసుకుని ఆయన మన నుండి ఏమి ఆశిస్తున్నారో అది వారికి సమర్పించడం ద్వారా వారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు... మనల్ని అశాంతికి గురిచేసే అరిషడ్వర్గాలని వారికి సమర్పించి వారు ఆచరించి చూపిన మార్గాన్ని మన దారిగా చేసుకుని నడిస్తే ఉన్నత జీవులుగా ఎదగతామనే వాస్తవాన్ని వారెప్పుడూ బోధిస్తారు. ఇది చదివినందువల్లో వినినందువల్లో....ఏమిటి ఉపయోగం....వినమంటే ఆచరించమని....ఇక్కడ పఠనం అనకుండా శ్రవణం అనటంలో అర్ధం ఇది.

కీర్తనము

2.కీర్తనం : మంచి చెడుల భేదభావం తెలిసి ఆచరణలో పెట్టాక...ఆ సుగుణాల వల్ల మనకి కాస్త శక్తి లభించి అది గర్వంగాను.. అహంగానూ మారుతుంది.. అప్పుడు భగవంతుడ్ని తలుచుకుంటూ ఆయనకెన్ని గొప్ప గుణాలు వున్నప్పటికీ సాధారణమైన వ్యక్తిగా ఆయనెంత అణకువ కలిగి ప్రవర్తించారో....గుర్తెరిగి ఆయన్ని కీర్తిస్తూ మన అహాన్ని చంపుకోవాలి.... దైవాన్ని స్మరిస్తూ అహన్ని చంపుకో అని బాబాగారు చెప్పారు. అంతేగాక ఆయన లీలలు ఇతరులతో చెప్పడం కూడా కీర్తనే.
ఉదా: సాయి సచ్చరిత్రలో మసీదులో చాలసేపు కూర్చున్న ఓ వ్యక్తి, ఓసారి బయటికి వెళ్లి వచ్చేసరికి అతని స్థానంలో ఓ పిల్ల కూర్చుని ఉంటుంది.. వెంటనే అతను ఆ స్థలాన్ని ఖాళీ చెయ్యమని పిల్లతో కఠినంగా మాట్లాడతాడు... అప్పుడు బాబాగారు ఆవేశంగా ఈ సృష్టి అంతా భగవంతుడి సొత్తు...ఎవరకీ దీనిపై యాజమాన్యపు హక్కులుండవు అంటారు...ఇదే అనుభవం బాబాగారికే ఎదురవుతుంది.. బాబాగారు ఓ రోజు ఆయన స్థానంలో కూర్చుని ఉండగా నానావలి గారు వచ్చి... కూర్చుంది చాల్లే లే!!! నేను కూర్చోవాలి ... అంటాడు.. వెంటనే బాబాగారు మరో ఆలోచన లేకుండా లేచి నిలబడగానే.... నానావలి కొద్దిసేపు అక్కడ కూర్చుని లేచి బాబాగారికి నమస్కరించి వెళ్లిపోతాడు.... మాట మాత్రంతో తుఫానుని నియంత్రించిన భగవానుడు.. తన ఆచరణ ద్వారా మనిషి ప్రవర్తన ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి... ఇలాంటి సందర్భాలు చదవి గుర్తుంచుకుని మన నిజజీవితంలో మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు అంత శక్తివంతుడైన ఆయనకే ఎలాంటి అహంలేనప్పుడు మనకెందుకుండాలి అని ఆయన గుణాలను గుర్తుకు తెచ్చుకుని ...ఆయన భక్తులుగా ఆయన కీర్తిని మరింత పెంచాలి.

స్మరణము

3.స్మరణం : స్మరణం అంటే తొమ్మిదిసార్లో, నూటెనిమిది సార్లో కాకుండా...వీలున్నప్పుడల్లా ఆయన్ని స్మరిస్తూ ఉండాలి. అందాన్ని, అందవికారమైన దాన్ని దేన్ని చూచినా అది ఆయన సృష్టిగా భావిస్తూ...ఆయన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.ప్రతి పనికి ముందు, పని ముగిశాక.... (అంత ఏకాగ్రత అవసరంలేని పనులకు) పని చేస్తూ ఆయన్ని స్మరించాలి..ప్రతి దాన్లోనూ ఆయన్ని చూచినప్పుడు ఒకనాటికి ఆయనకి దయకలిగి దర్శనభాగ్యం ప్రసాదిస్తాడు. కలియుగంలో కేవలం భగవంతుడి నామస్మరణే మానవులని అన్ని పాపాలనుండి విముక్తులను చేస్తుందని వేదవ్యాస మహర్షుల వారు భాగవతంలో అజామిళుని కథలో చెప్పారు..మనం విజయదశమి రోజు ఆయుధాలను పూజిస్తాం.వినాయకచవితి రోజు పుస్తకాలని బొట్టుతో అలంకరించి విఘ్నేశ్వరుడి ముందు పెడతాం. ఏ పెద్ద వస్తువు కొన్నా మనం దానికి బొట్టు పెడతాం, వాహనాలకి పూజ చేయిస్తాం.. ప్రతిదాన్లోనూ మనం భగవంతుడ్ని చూస్తాం... కానీ కొంతసేపటికి మరిచిపోతాం ఈ మరుపు వల్లే మనం చాలా తప్పులు చేస్తాం... అందుకే అయన్ని నిత్యం స్మరించాలి... గురు నామమే మహామంత్రం...అది గుర్తించి ఆయన్ని స్మరించాలి.
ఉదా: రోహిల్లా శిరిడిలో బిగ్గరగా భగవంతుడి నామం ఉచ్ఛరించడం వల్ల ఇబ్బంది కలిగిన భక్తులు అతనితో తలపడలేక బాబాగారికి విన్నవించుకుంటే ఆయన వాడిని ఇంకా బిగ్గరగా నామం ఉచ్ఛరించనివ్వండి.. అతడు చేసే స్మరణ నాకెంతో ఆనందాన్ని కల్గిస్తుంది.. అతని జోలికెవరు వెళ్లకండి అన్నారు.రోహిల్ల ఉచ్ఛరించే ఆ భగవంతుడెవరో చెప్తూనే... అది వారికెంత ఇష్టమైనదో తెలియజెప్పారు. నానాచందోర్కర్‌, బాబాగారి పక్కనే కూర్చున్నప్పటికీ అందమైన అమ్మాయిని చూడగానే మనసు చలించి, ఆమెని ఇంకొక్కసారి చూడాలనిపిస్తుంది. అప్పుడు బాబాగారు ఏమన్నారో చూడండి...నానా (చందోర్కర్) సింహద్వారం ఉండగా దొడ్డిదారిన వెళ్తావెందుకు?? ఇంద్రియాల పనిని ఇంద్రియాలని చేసుకోనివ్వు... మనసుకి ఆలోచనలు కల్పించకు.అందమైన దేవాలయాలెన్ని (దేహాలు) లేవు?అందులో ఉన్న దైవాన్ని దర్శించు...అందమైన దేహాన్నిసృష్టించిన దేవున్ని స్మరించు అన్నారు.

పాదసేవనము

4.పాదసేవనం : సద్గురువులు, మహాత్ముల పాదాలెంత పవిత్రమైనవో హిమాలయయోగులు అనే గ్రంథంలో ఓ మహాయోగి రామాగారికి చెప్తూ ఇలా అంటారు.. మహాత్ముల పాదాలెందుకు సేవించాలంటే... బ్రహ్మఙ్ఞానం పొందిన మహాత్ములు భగవంతునితో ఐక్యమై ఉంటారు... అలా ఐక్యమై భగవంతుని పాదాలచెంత తమ జీవితంలో సర్వస్వమూ అర్పిస్తారు.సామాన్యంగా జనాలు ఎదుట వారిని ముఖం చూచి పోల్చుకుంటారు, కానీ ఋషీశ్వరుల ముఖం (అహం) ఇక్కడ ఉండదు, భగవంతుని చెంత ఉంటుంది (ఐక్యమైవుంటుంది). జనాలిక్కడ ఆయన పాదాలనే (ఆచరణ) కనుగొంటారు.అందుచేత ఆయన పాదాలకి నమస్కరించాలి.పాదసేవనం అంటే పాదాలను కౌగలించుకోవటం, ముద్దడటమో, పాదాల చెంత తలను వాల్చడమో కాదు...ఆయన అనుసరించి చూపిన మార్గంలోనే నడవటం...ఆయన చెప్పిన వాటిని ఆచరించి చూపించడం.మహాత్ముల పాదాల పవిత్రత ఎంతటిదంటే.... సాయి సచ్చరిత్రలో దాసగణుకి బాబాగారు వారి పాదలనుండే త్రివేణీ సంగమంలోని జలాలని అనుగ్రహించారు....ఎవరి పాదాలనుండి గంగ ఉద్భవించి పవిత్రమైందో ఆ భగవంతుడు తనే అని నిరూపించారు. అత్యంత పవిత్రమైన గంగ... పాపుల వల్ల మలినమై మహాత్ముల స్పర్శచే పునీతమవుతుంది... అంతటి మహాత్ములు చూపిన దారి మనల్ని ఎంత ఉన్నత స్థితికి చేరుస్తుందో గుర్తించి దానిని ఆచరించి ఫలితాలు పొందాలి.

అర్చనము

5.అర్చనం : హిందువులకి సగుణరూపంలో (ఫొటో, విగ్రహం) భగవంతుడ్ని అర్చించాలనే నియమం విధించబడింది....కృతయుగంలో విగ్రహారాధన లేదు..గురుశిష్య పరంపర కొనసాగిన కాలం అది...త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు గురువులని ఆశ్రయించారు..కానీ క్రమంగా సామాన్యులు గురువులని, మహాత్ములని దూరం చేసుకోవటం వల్ల... మనకి భగవంతుడు దూరమయ్యాడు, అదీకాక కలియుగంలో ప్రతివీధిలోనూ ఓ గురువు వెలుస్తాడు... సద్గురువు ఎవరో తెలుసుకునే ఙ్ఞానం అల్పులైమైన మనకి ఉండదు కాబట్టి.. ఋషులు ఇది ముందుగా గ్రహించి మనకి విగ్రహారాధన అలవాటు చేసారు.మనం ఓ సద్గురువుని ఆశ్రయించి (శ్రీపాద వల్లభ మహారాజ్. నృసింహ సరస్వతి మహారాజ్, మాణిక్య ప్రభువు, అక్కల్‌కోట స్వామి సమర్ధ, షేగాఁ గజానన మహారాజ్, తాజుద్దీన్ మహారాజ్‌, శిరిడీ సాయిబాబా, రాఘవేంద్రస్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి, మహావతార్ బాబాజీ ) ఈ ఆరాధన సక్రమంగా చేస్తూ..పారాయణలు, వ్రతాలు చేస్తూ.. వారి అనుగ్రహాన్ని పొందితే వారు మన బాధ్యత తీసుకుంటారు.
అర్చన విధాలు : ముగ్గు, సుగంధము, అక్షతలు, పుష్పము, ధూపం, దీపం, ఉపహారం, తాంబూలం అని ఎనిమిది విధాల భగవంతుడి సగుణరూపాన్ని అర్చించాలి. అర్పించడమంటే సమర్పించడం...మనకున్న వాటిని భగవంతుడికి సమర్పించడమే అర్చన....ప్రతి అవసరానికి భగవంతుడిపై ఆధారపడే మనకి ఆస్తులేముంటాయి? ఈ చరాచర జగత్తుని సృష్టించిన ఆయనకి మనమేమివ్వగలం?? ఆయన కోరుకొనేది మనలో దుర్గుణాలు ఆయనకి సమర్పించి.... పరిపూర్ణమైన ప్రేమని ఇచ్చి.. ఆయన అనుగ్రహాన్ని పొందమనే ఆయన చెప్పేది.

వందనము

6.వందనం : ప్రతి పనిలోనూ..మన ప్రతి కదలికలోను ఆయన మనల్ని ఎలా కనిపెట్టుకుని ఉన్నారో గుర్తెరిగి ఆయనపట్ల కృతఙ్ఞతా భావం కలిగివుండటంతినే అన్నం..తాగే నీరు...పీల్చే గాలి అన్నీ ఆయనవే....ఉద్యోగం రాకున్నా, ఉన్నతి కోసం ఇలా ప్రతిదానికి ఆయన్ని ప్రార్థిస్తాం...అన్నీ ఇచ్చేది ఆయనే కాబట్టి వందనం అంటే నమస్కరించటం...ఉన్నతమైన వారికి మన శిరస్సు వంచి నమస్కరిస్తాం..శిరస్సు వంచటం అంటే పెద్దల గొప్పతనాన్ని గుర్తించి మన అహాన్నిఒదలి వారి పట్ల వినయ, విధేయతలు ప్రకటించటం.... ఈ వినయ, విధేయతలు వారి సమక్షంలోనే కాదు సుమా..వారికి దూరంగా ఉన్నప్పటికీ వారి పట్ల మనంఅదే గౌరవభావాన్ని ప్రదర్శిస్తాం...అదేవిధంగా భగవంతుడి గొప్పతనాన్ని, ఆయన సమస్త జీవులలోను ఉన్నారని గుర్తించి సకల జీవరాసుల పట్ల కరుణ, దయ,ఇతరులతో సోదరభావం కలిగివుండటమే అసలైన వందన సమర్పణ. కేవలం గుడిలో విగ్రహం ముందు మాత్రమే కాకుండా..మనం ఉన్న ప్రతి చోటా, మనం కలిసే ప్రతి వ్యక్తిలోనూ జీవించి ఉన్న ప్రతి జీవిలోనూ... భగవంతుడున్నాడని గమనించి మన ప్రవర్తనని సక్రమంగా మలచుకోవాలి.

దాస్యము

7.దాస్యం : మనం చూస్తున్న ప్రకృతిలో ప్రతిదానిని సృజించింది భగవంతుడే... చూచే ప్రతిదానిలోనూ, చేస్తున్న ప్రతి పనిలోనూ ఆయన ఉన్నాడు.... ఆయనే మనల్ని ఆ పనికి నియమించారని... అందరికి యజమాని ఆయనే అని..మనం చేసే పని ఆయనని సంతృప్తి పరిస్తే చాలు అనే సేవ్యభావంతో చేస్తూ..ఆయన సేవకుడిగా మనల్ని మనం భావించుకోవటం ద్వారా దురహంకారం అంతమయి...ఆయన బిడ్డలమనే సంతృప్తి మనకి కలుగుతుంది. సత్యసాయిబాబా ఒక సందర్భంలో మనప్రజలు ప్రతిపనిలోనూ భగవంతుడినే చూస్తారు అని, దానికి ఉదాహరణగా మన లారీ డ్రైవర్లు, లారీని నడపడానికి ముందు అగరువత్తులు వెలిగించి స్టీరింగ్‌కి నమస్కరిస్తారు.. చేసే పనిలో భగవంతుడ్ని చూడటం అంటే ఇదికాక మరేమిటి అన్నారు... దాస్యం అంటే సేవ చెయ్యటం.. పైన ఆరు విధాలుగా భగవుంతుడికి భక్తిని సమర్పిస్తూ వచ్చిన భక్తుడు ఈ మజిలీలో తన కోసం తను చెయ్యవలిసిన పనంటూ ఏమీలేదని గుర్తించి...అందరిలోనూ, అన్నింటిలోనూ భగవంతుడ్ని చూస్తూ..వారు చేయవలసిన పని విధివిధాన పూర్వకంగా చేస్తూ అదే భగవంతుని సేవగా భావిస్తూ భగవంతుడికి అంకితమైపోతారు. ఇప్పుడు వీరు నడిచే మార్గమే భగవంతున్ని చేరుకొనే దారి అవుతుంది.

సఖ్యము:

8.సఖ్యం : భగవంతుడు అంటే రాయో, రప్పో కాదని...విశ్వమంతటా వ్యాపించిన చైతన్యమే అని తెలుసుకుని...ఆయన్ని... తండ్రిగానో..తల్లిగానో...కొడుకుగానో... ప్రియుడిగానో..తాతగానో.... మనింట్లో పెద్దవాడిగా గుర్తించి.. మనం ఏమి తిన్నా.. ఏమి తాగినా ఆయనకి సమర్పించి... మనకెంతో ఇష్టమైన వ్యక్తి పట్ల మనమెలా ఆదరభావం ప్రదర్శిస్తామో అంతే ఆదరణ, ప్రేమ ఆయనపట్ల చూపిస్తూ..ఆయనకి దగ్గరవ్వాలి..ఒకసారి బంధం అంటూ ఏర్పడితే..మనం అయన్ని ఒదిలిపెట్టినా ఆయన మనల్ని ఒదలడు. ఇక్కడి వరకూ వచ్చిన భక్తులకి రాయిలో కూడా చైతన్యం కనిపిస్తుంది..రామకృష్ణ పరమహంస వారి జీవితంలో వారు కాళీమాతకి చేరువైన తీరు గమనించండి... మనకెంతో ఇష్టమైన మనిషితో ఎలా మెలగుతామో ఆయన కాళీమాత విగ్రహంతో అలా మెలగేవారట..విగ్రహానికి అన్నం తినిపించడం.చామరాలు వీచటం ఇవి చూచి ఇతరులు ఆయన పిచ్చివాడనుకునేవారట, అంతగా ఆయన భగవంతుడికి దగ్గరయ్యారు...చివరికి ఆయన కాళిమాతని మరవలేకపోతుంటే తోతాపురి గురుదేవుల వారు రామకృష్ణుల వారిని మందలించారట. మూడురోజుల్లో తోతాపురి గురుదేవులవారు శ్రీరామకృష్ణులవారికి ఆత్మఙ్ఞానాన్ని ప్రసాదించారు.... సాయిబాబా గారు కూడా వారి గురుదేవుల వారిని ఎలా సేవించేవారో సచ్చరిత్రలో వివరించారు. మనిషికి చిట్టచివరి బంధమే గురువు. మనుషులకి భగవంతుడితో దగ్గరగా మెలిగే అవకాశం కేవలం గురువుల సన్నిధిలోనే కలుగుతుంది. ఎందుకంటే గురువే భగవంతుడు, భగవంతుడే గురువు కాబట్టి. నిరాకారుడైన ఈశ్వరుడు సాకార రూపంగా రావడమే గురువు అవడం.

ఆత్మనివేదనము

9.ఆత్మనివేదనం : మన దగ్గరున్నవన్నీ సమర్పించేశాక మిగిలేది ఆత్మ ఒక్కటే అదే పరబ్రహ్మం. ఈ స్థితిలో భగవంతుడికి, భక్తునికి భేదంలేదు..ఇద్దరూ ఒక్కటే. సద్గురువుని ఆశ్రయించి...ఆయన్ని అనుసరించి..ఆయన భోదలే జీవితంగా మలచుకున్నవారు ఆయనే అవుతారు....ఇదే భ్రమరకీట న్యాయం..భ్రమరాన్నే చింతించిన కీటకం భ్రమరం అవుతుంది...ఇప్పుడు భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడు...సద్గురు మిలరేపా, సద్గురు ఎక్కిరాల భరద్వాజ మహారాజ్‌, సద్గురు సిద్ధప్ప ఇలాంటివారు గురువుగారిని ఆశ్రయించి, వారి ఉపదేశాలు ఆచరించి గురువులు అయ్యారు. ఈ స్థితిలో వారేమైనా చెయ్యగల సమర్ధులై తమ మార్గంలోకి ఎంతోమంది రావడానికి ప్రేరణ కలిగిస్తారు...జనన, మరణాల్ని జయించి ఎప్పటికీ జీవిస్తూ తమ భక్తుల, శిష్యుల బాగోగులు గమనిస్తూ వారికి సన్మార్గాన్ని చూపిస్తారు.
ఆధ్యాత్మికతలో గురువులు ఉపయోగించే పదాలన్నీ నిగూఢంగా వుంటాయి..తిరిగి తిరిగి దాన్ని అలోచిస్తేగానీ దాని లోతైన అర్ధం మనకి అర్ధంకాదు. పారాయణ ద్వారా నియమబద్ధమైన జీవితానికి అలవాటుపడుతూ..క్రమశిక్షణ కలిగివుండటం అలవాటుగా చేసుకోవాలి... నామం రాస్తూ పోవటం ద్వారా ఏకాగ్ర దృష్టి పెంచుకోవాలి....నామానికి, రూపానికి, గుణానికి అతీతమైన భగవంతుడు ధ్యానంలో మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు. ధ్యానం చేస్తూ భగవంతుడికి దగ్గరవ్వాలి.మరి భగవంతుడిపై మనకి ప్రేమ కలగాలంటే ఏం చెయ్యాలి?? మహాత్ముల, భక్తుల, సద్గురువుల, వారి శిష్యుల జీవిత చరిత్రలు చదువుతూ వారు ఏ విధంగా చేసారో గమనిస్తూ...వాటిని ఆచరిస్తూ పోతే..మనం అన్నిటినీ ఒదులుకోవటానికి సిద్ధపడగానే భగవంతుడు అంతులేని ప్రేమ అనే సంపదని ప్రసాదిస్తారు.